Bharat Rice | భారత్ రైస్ రెండో విక్రయం ప్రారంభం..
Bharat Rice | భారత్ రైస్ రెండో దశ విక్రయం ప్రారంభం
కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి ప్రహ్లద్ జోషి వెల్లడి
అందుబాటులో 5 కేజీ, 10 కేజీ ప్యాకెట్లు
Hyderabad : దేశ వ్యాప్తంగా పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలతో సామాన్యులపై రోజు రోజుకు పెను భారం పడుతోంది. నిత్యావసర సరుకులు సరిపడా కొనుగోలు చేయలేని పరిస్థితులు వస్తున్నాయి. అలాంటి వారు దేశ వ్యాప్తంగా కోట్లలో ఉంటారు. అయితే అలాంటి వారందరికీ ఊరట కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరోసారి భారత్ బ్రాండ్ విక్రయాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. భారత్ బ్రాండ్ ద్వారా గోధుమ పిండి, బియ్యం విక్రయాలను మళ్లీ తెచ్చింది. రూ. 34కే కిలో బియ్యం, రూ. 30కే గోధుమ పిండి కొనుగోలు చేయవచ్చు. దేశంలో భారత్ ఆటా, భారత్ రైస్ రిటైల్ విక్రయడానికి సంబంధించిన రెండో దశను మంగళవారం కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రారంభించారు. వినియోగదారులకు అవసరమైన ఆహార పదార్థాల సబ్సిడీ ధరలకు లభ్యతను నిర్ధారించడంలో భారత ప్రభుత్వ నిబద్ధతకు ఇది నిదర్శనమని కేంద్ర మంత్రి అభిప్రాయపడ్డారు. భారత్ బ్రాండ్ కింద బియ్యం, ఆటా, పప్పులు వంటి కనీస ఆహార పదార్థాల రిటైల్ విక్రయం ద్వారా ధరలను నిలకడగా కొనసాగించడంలో సహాయపడిందని ఆయన తెలిపారు. రెండో దశ ప్రారంభం లో, 3.69 LMT రకం గోధుమలు, 2.91 LMT రకం బియ్యం రిటైల్ అమ్మకానికి అందుబాటులోకి తెచ్చామన్నారు. మొదటి దశలో, సుమారు 15.20 LMT రకం భారత్ అటా, 14.58 LMT రకం భారత్ రైస్ సాధారణ వినియోగదారులకు కూడా సబ్సిడీ ధరలకు అందుబాటులో ఉంచినట్లు కేంద్ర మంత్రి తెలిపారు.
* మరి వీటిని ఎక్కడ కొనుగోలు చేయాలి?
భారత్ బ్రాండ్ ద్వారా తక్కువ ధరకే విక్రయిస్తున్న గోధుమ పిండి, బియ్యం కొనుగోలుకు వివిధ వేదికలు ఉన్నాయి. నాఫెడ్ కేంద్రాలు, ఎన్సీపీఎఫ్, కేంద్రీయ భండార్, ఈ-కామర్స్ సంస్థల ద్వారా వీటిని కొనుగోలు చేయవచ్చని కేంద్రం తెలియజేసింది. సాధారణ ప్రజలకు ధరల భారం నుంచి ఉపశమనం కల్పించడం కోసం తాత్కాలిక విక్రయాలు చేపట్టినట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈ రెండో దశలో భాగంగా 3.69 లక్షల టన్నుల గోధుమలు, 2.91 లక్షల టన్నుల బియ్యాన్ని ఎఫ్సీఐ నుంచి సేకరించినట్లు పేర్కొన్నారు. ఈ స్టాక్ మొత్తం పూర్తయ్యే వరకు విక్రయాలు ఉంటాయన్నారు. అవసరమైతే అదనపు కేటాయింపులు చేసేందుకు కేంద్రం సిద్ధంగానే ఉందని కేంద్ర మంత్రి అన్నారు. అయితే భారత్ బ్రాండ్ ద్వారా రూ. 30కే కిలో గోధుమ పిండి విక్రయిస్తామని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ పిండి 5 కిలోలు, 10 కిలోల ప్యాకెట్ల రూపంలో లభిస్తాయన్నారు. ఇక రూ. 34కే కిలో బియ్యం ఇస్తున్నామని, ఇవి సైతం 5 కిలోలు, 10 కిలోల ప్యాకెట్లలో లభిస్తాయన్నారు. గత ఏడాది 2023, అక్టోబర్ నెలలో తొలి ఫేజ్ భారత్ బ్రాండ్ విక్రయాలు ప్రారంభించింది కేంద్రం. 2024, జూన్ నెల వరకు విక్రయాలు చేపట్టిందన్నారు. మొత్తం 15.20 లక్షల టన్నుల గోధుమలు, 14.58 లక్షల టన్నుల బియ్యాన్ని విక్రయించినట్లు పేర్కొన్నారు.
* * *
Leave A Comment